శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై 31 నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ పవిత్రోత్సవాలు ఆగస్ట్ 2వ తేదీ వరకూ జరుగనున్నాయి. పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి సేనాధిపతి ఉత్సవం, మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలు నిర్వహించారు. యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 31వ తేదీ యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, ఆగష్టు 1న పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్ట్ 2న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ‌ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగ‌ర‌త్న, ఏఈవో శ్రీ పార్థసారథి, ఆల‌య ప్రధాన అర్చకులు శ్రీ ఆనంద‌కుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ సోమశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends