
కేరళలోని కన్నూర్ జిల్లాలో వలపట్టణం నది ఒడ్డున పరాస్సిని మడప్పుర శ్రీ ముత్తప్పన్ ఆలయంలో స్వామివారికి అందించే నైవేద్యం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ శివుని స్వరూపంగా భావించే ముత్తప్పన్కు చేపలు, కల్లును నైవేద్యంగా సమర్పిస్తారు. ఉత్తర కేరళలో ఇదొక ప్రత్యేకమైన సంప్రదాయ ఆరాధన అని చెబుతారు. అంతేకాకుండా ఈ ఆలయంలో పూజలు సైతం ఇతర ఆలయాలకు భిన్నంగానే ఉంటాయి. స్వామివారిని ‘తెయ్యం’ ప్రదర్శన ద్వారా ఆరాధిస్తారు.
ఇక స్వామివారికి చేపలు, కల్లును నైవేద్యంగా సమర్పిస్తే కోరుకున్న కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని నమ్మకం. స్వామివారికి నైవేద్యం సమర్పించిన అనంతరం ఆ మాంసాహారాన్ని భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ ఆలయంలో కుక్కలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. వాటికి కూడా ఆహారాన్ని అందిస్తారు. ఇక ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇక్కడో ఉత్సవం జరుగుతుంది. దీనిని ఆలయ ప్రధాన పండుగగా చెబుతారు. ముత్తప్పన్ తిరువొప్పన మహోత్సవం పేరిట నిర్వహించే ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఆ సమయంలో తెయ్యం నృత్యం, కథాకళి వంటి ప్రదర్శనలు ఇస్తారు.
