బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలు తెలుసుకున్నాం కదా. ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బ్రహ్మాండ పురాణంలోనూ ఈ ఆలయ ప్రస్తావన ఉంది. శ్రీరామ చంద్రడు స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని తెలుసుకున్నాం కదా. బ్రాహ్మణుడైన రావణాసురుడిని సంహరించిన మీదట బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తి కోసం శ్రీరాముడు ఇక్కడ శివుడిని ప్రతిష్టించి పూజలు చేశాడు. 650 మంది శిల్పులతో రామాచారి అనే శిల్పకారుడు కొన్నేళ్ల పాటు ఈ ఆలయ నిర్మాణం కోసం శ్రమించాడట. 15వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో ఆలయ అభివృద్ధి జరిగిందట.
ముఖ్యంగా ప్రౌఢ దేవరాయల పాలనలో తాడిపత్రి పెమ్మసాని రామలింగ నాయకుడు మండలాధీశుడుగా ఉన్న కాలంలో తిమ్మనాయుడు, పెమ్మసాని రామలింగ నాయకుడు స్థానికంగా దొరికిన రాళ్ళతో నిర్మించారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. నల్లరాతితో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. శిల్పకళకు ఈ ఆలయం పెట్టింది పేరు. ఈ ప్రాంతానికి తాడిపత్రి అనే పేరు రావడం వెనుక కూడా ఒక కథ ఉంది. త్రేతాయుగంలో తాటకి అనే రాక్షసి ఈ ప్రాంతంలో నివశించిందట. అందుకే ఈ ప్రాంతానికి తాటిపత్రి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అది తాడిపత్రిగా మారింది.