1300 ఏళ్ల నాటి ఆలయం.. దీని ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు..

తమిళనాడులోకి కాంచీ పురం గురించి తెలియని వారుండరు. ఇది హిందూ ఆలయాలకు నెలవు. అత్యంత పవిత్ర ప్రదేశం. కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి ఆలయాలు సైతం ఈ కాంచీపురంలో ఉన్నాయి. అందుకే దీనిని దేవాలయాల నగరం అని కూడా పిలుస్తుంటారు. ఆ ఆలయాల్లో మిక్కిలి పేరుగాంచినది కైలాసనాథ్ దేవాలయం. అలనాటి గొప్ప వాస్తు శిల్పకళకు సైతం ఈ ఆలయం నిదర్శనం. కైలాసనాథ్ అంటే పేరులోనే శివయ్య ఉన్నాడు కదా. ఈ ఆలయం గరళ కంఠుడికి అంకితం చేయబడింది. శివుడు, శ్రీ మహావిష్ణువు, గణేశుడు, సూర్యుడు, దేవి, కార్తికేయులను పూజించేందుకు ఈ ఆలయాన్ని 1300 ఏళ్ల క్రితం నిర్మించారు.

ముఖ్యంగా ఈ ఆలయంలోని శిల్ప సంపదను చూసి భక్తులు మంత్రముగ్దులవుతుంటారు. ఈ ఆలయ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఆలయ నిర్మాణం రాళ్ల ముక్కలతో జరిగిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశేషమేంటంటే.. ప్రధాన ఆలయ సముదాయంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 58 చిన్న ఆలయాలను నిర్మించడం జరిగింది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు ఎడమ వైపున, 6 కుడివైపున యాత్రా స్థలాలు ఉన్నాయి. మరో విశేషం ఏంటంటే.. ఆలయ గర్భగుడిలో గ్రానైట్‌తో చేసిన భారీ శివలింగం ఉంటుంది. అది చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆలయ గర్భగుడిపై ద్రవిడ శిల్పకళలో ఒక విమానాన్ని నిర్మించారు.

Share this post with your friends