తమిళనాడు తిరువారూర్ జిల్లాలోని తిరుక్కొళ్లికాడులోని పొంగు శనీశ్వర ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం నిర్వహించాడు. ఆ యాగంలో అగ్నిదేవుడు సైతం పాల్గొన్నాడు. ఇది కాస్తా ఈశ్వరునికి ఆగ్రహం కలిగించింది. అప్పటికే పాండవులు నిర్మించుకున్న లక్క గృహాన్ని అగ్నిదేవుడు ఆహుతి చేయడం కూడా పరమ శివుని ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణాలతో అగ్నిదేవుడిని చూడగానే శివుడు తన శక్తులన్నీ కోల్పోవాలని శపించాడట. అప్పుడు అగ్నిదేవుడు పశ్చాత్తాపంతో తిరుక్కొళ్లికాడుకు వచ్చి తపస్సు చేయగా.. పరమేశ్వరుడు అగ్ని రూపంలో ప్రత్యక్షమై కరుణించాడట. అప్పటి నుంచి శివుడు ఇక్కడ అగ్నీశ్వరర్గా కొలువుదీరాడు.

ఇక శనీశ్వరుడి విషయానికి వస్తే.. ఏలిన నాటి శని కారణంగా పడే బాధలతో భక్తులు తనను దూషిస్తున్నారని శని ఆవేదన చెందాడట. వశిష్ట మహర్షి వద్దకు వెళ్లి తనకు పరిష్కారం చూపమని వశిష్ఠ మహర్షిని ప్రార్ధించాడంట! అప్పుడు వశిష్ఠ మహర్షి.. ఈశ్వరుని పూజించమని సూచించాడంట. శని దేవుడు ఇక్కడకు వచ్చి శివుని గురించి తపస్సు చేశాడట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఈ ప్రదేశంలో శనిని దర్శించి, పూజించే వారికి సకల శుభాలు చేకూరుతాయని వరమిచ్చాడంట. అంతేకాకుండా తన పేరులోని ఈశ్వరుని కూడా శనికి జోడించాడట. అలా ఇక్కడ శనీశ్వరుడుగా శని దేవుడు పూజలందుకుంటున్నాడు.
