నవగ్రహాలలో గురు గ్రహాన్ని శుభ గ్రహమని చెబుతారు. గురు గ్రహ అనుకూలత ఉంటే మనకు సకల శుభాలు జరుగుతాయట. ఒక్క గురు గ్రహం అనుకూలంగా ఉంటే చాలు.. తక్కిన గ్రహాలు అనుకూలంగా లేకపోయినా తలపెట్టిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయని చెబుతారు. గురు గ్రహం అత్యంత శక్తివంతమైన గ్రహంగా పేర్కొంటారు. గోచార రీత్యా గురు గ్రహ అనుకూలత లేకుంటే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ సమయంలో దత్తాత్రేయ స్వామి వంటి గురువులను ఆశ్రయించడంతో పాటు కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటిస్తే శుభం జరుగుతుందని చెబుతారు. ఆ పరిహారాలేంటో తెలుసుకుందాం.

సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులు తమ తమ అంశలను ఒక్కటిగా చేసి అత్రి మహర్షి, అనసూయ దంపతులకు జన్మించిన వరపుత్రుడే దత్తాత్రేయుడు. బాల్యం నుంచి ఎన్నో మహిమలు ప్రదర్శిస్తూ ఉండేవాడట. దిగంబరుడిగా, అవధూతగా ఆవిర్భవించిన దత్తాత్రేయ స్వామిని ఆశ్రయిస్తే చాలు.. గురు దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. మరి అలాంటి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందడమెలా? అంటే దానికీ ఒక పరిష్కారం ఉంది. అదేంటంటే.. గురువారం రోజున దత్తాత్రేయస్వామిని ఆరాధించడమే. గురుగ్రహ దోష నివారణకు శక్తివంతమైన పరిహారం దత్తాత్రేయ తిలక ధారణ చేయడం.
