తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయంలో మరకత గణపతి కూడా ఉండేవాడట. కేరళపురం రాజుకు రామేశ్వరం రాజు బహుమతిగా మరకత గణపతిని ఇచ్చాడట. దానిని వినాయకుడితో పాటే ఆలయంలో ప్రతిష్టించాడట. అయితే ప్రస్తుతం ఈ క్షేత్రంలో మరకత గణపతి లేడు. దీనికి కారణమేంటంటే.. తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి చోరికి గురైందని చెబుతారు. కానీ అదృష్టవశాత్తు ఈ వర్ణ గణపతి మాత్రం ఇక్కడే భద్రంగా మిగిలిపోయాడు. అత్యంత మహిమాన్వితమైన ఈ గణపతిని కొంగు చాచి అడగాలే కానీ ఏదైనా చేస్తాడట.

ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమ శాస్త్రానుసారం జరగలేదని చెబుతారు. ఒక రాతి పీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి ఈ వినాయకుని మహిమే కారణమని భక్తులు చెబుతారు. శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయంలోని గోడలు అద్భుతమైన పురాతన వర్ణ చిత్రాలతో మనల్ని ఆకట్టుకుంటాయి. మహిమాన్వితమైన వర్ణ గణపతికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడి వినాయకుడిని ధర్మబద్ధమైన ఏ కోరికతోనైనా భక్తులు కొబ్బరికాయ గానీ, బియ్యం మూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందట.
