భక్తితో పాటు ప్రేమతో కూడా భగవంతుడిని వశం చేసుకోవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన మహాసాధ్వి గోదాదేవి. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆమె, విష్ణుచిత్తుడి కుమార్తెగా శ్రీ విల్లిపుత్తూరులో జన్మించి చిన్ననాటి నుంచే రంగనాథుడు భక్తిలో మునిగిపోయింది. యుక్తవయసులో ఆ భక్తి ప్రేమగా మారి రంగనాథుడినే తన భర్తగా భావించింది. ధనుర్మాసంలో ముప్పై రోజులు శ్రీ వ్రతాన్ని ఆచరిస్తూ… రోజుకో పాశురం చొప్పున ముప్పై పాశురాలు రచించి రంగనాథునికి సమర్పించింది. ఆమె నిర్మలమైన ప్రేమకు లొంగిపోయిన శ్రీహరి… శ్రీరంగంలో రంగనాథునిగా అవతరించి గోదాదేవిని వివాహం చేసుకున్నాడు. భోగి నాడు రంగనాథునిలో గోదాదేవి ఐక్యమైంది. భక్తి ప్రేమ కలిస్తే భగవంతుడే భర్త అవుతాడని లోకానికి చాటింది గోదాదేవి.

