
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారికి ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న భూములు క్రమక్రమంగా ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఒక్క ఈవోపైనే కాకుండా.. ఆలయ సిబ్బందిపై కూడా ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఈవోను సిబ్బంది చికిత్స నిమిత్తం భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అసలు ఇంతకీ భద్రాచలంలో గొడవేంటి? ఆలయ ఈవోపై ఎందుకు దాడి జరిగింది? వంటి విషయాలను తెలుసుకుందాం.
భద్రాచలం పట్టణాన్ని మినహాయించి దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ఏపీలో కలిపారు. అలా ఏపీలో కలిసిన వాటిలో పురుషోత్తపట్నం ఒకటి. అయితే రెండేళ్ల క్రితం అంటే 2023 అక్టోబర్లో కూడా ఇలాగే భద్రాద్రి రామాలయ అధికారులను కర్రలతో వెంబడించి మరీ కబ్జాదారులు కొట్టడం జరిగింది. ఆ తరువాత 2024లో ఆలయ ఈవో వెళ్లగా అప్పుడు కూడా దాడికి యత్నించారు. మరోసారి తాజాగా పురుషోత్తపట్నం వెళ్లిన ఈవోను గ్రామస్తులు వదల్లేదు. దాడి చేశారు. ఈ ఒక్క గ్రామం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి. పురుషోత్తపట్నంలో భద్రాచలం రామాలయానికి చెందిన 889 ఎకరాల భూమి ఉంది. కానీ ఇది రోజురోజుకూ ఆక్రమణకు గురై కుంచించుకుపోతోంది. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో భద్రాద్రి రామయ్య ఆలయానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. ఈ క్రమంలోనే పురుషోత్తపట్నంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడి జరిగింది.
