ఇవాళ భద్రాద్రి రామయ్యకు ఊంజల్, సింహవాహన సేవ

భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో వసంత ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణం.. ఆపై శ్రీరామ పట్టాభిషేకం వంటివి కన్నుల పండువగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 9 వ తేదీ నుంచి వసంత ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు భద్రాద్రిలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకూ కొనసాగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈ రోజు చతిస్తానర్చన, ఊంజల్ సేవ, సింహవాహన సేవలను స్వామివారికి నిర్వహించనున్నారు.

ఇక ఈ నెల 22న అంటే రేపు స్వామివారికి వసంతోత్సవం, హవనం, గజ వాహన సేవ నిర్వహించనున్నారు. 23న చక్రతీర్థం, పూర్ణాహుతి కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ సారి అంటే క్రోథి నామ సంవత్సరంలో భద్రాద్రి రామయ్య ఆదాయం పెరగనుందని.. వ్యయం తగ్గనుందని ఇప్పటికే జ్యోతిష్య పండితులు వెల్లడించారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ విషయాలను వివరించారు. స్వామివారి కల్యాణంతో పాటు పట్టాభిషేకం తదితర కార్యక్రమాలన్నీ అత్యంత వైభవంగానూ ప్రశాంతంగానూ జరిగాయి.

Share this post with your friends