
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 28న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుంచి శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ విష్వక్సేనులవారు, శ్రీరామానుజాచార్యులు, శ్రీ నమ్మాళ్వార్, శ్రీ కూరత్తాళ్వార్, శ్రీ తిరుమంగైయాళ్వార్ ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభమైంది. తిరుపతి వీధుల గుండా కపిలతీర్థానికి చేరుకున్న అనంతరం అక్కడ తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు.
అనంతరం కపిలతీర్థం నుంచి బయల్దేరి పిఆర్ గార్డెన్ మీదుగా మధ్యాహ్నం తిరిగి ఆలయానికి చేరుకుంది. సాయంత్రం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామివారికి గజ మాలతో మర్యాద జరిగింది. అనంతరం సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాధాకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
