జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. క్షీరసాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.
జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక పూజలు, హోమాలతో పాటు ఉదయం, సాయంత్రం వివిధ వాహన సేవలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి సర్వభూపాల వాహనంపై రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి అలంకారంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు వాహన సేవలో పాల్గొని అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు ఉన్నారు.