పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో కొలువైన శివయ్య గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఒకటి కాదు.. మూడు శివలింగాలుంటాయి. అందుకే దీనిని త్రిలింగ క్షేత్రమని పిలుస్తారు. శ్రీరాముడు, పరుశురాముడు, లక్ష్మణుడు ఈ మూడు శివలింగాలను ప్రతిష్టించారని చెబుతారు. అయితే ఇక్కడి గుడిని నిత్యం నీటితో నింపకుంటే అగ్నిప్రమాదం జరుగుతుందని తెలుసుకున్నాం కదా. దాని కథేంటో తెలుసుకుందాం. పూర్వం మాతృహత్య పాతకం నుంచి బయటపడాలని పరశురాముడు నిర్ణయించుకున్నాడట. అప్పుడు ఎక్కడ ఓంకార శబ్ధం వినిపిస్తుందో అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని పరశురాముడు బయలు దేరాడట.
క్రౌంచ పర్వతాన్ని ఛేదించి శివలింగం తీసుకుని గోస్తనీ నది ప్రాంతానికి పరశురాముడు చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడ నదీ గర్భంలో ఋషులు తపో దీక్షలో ఉండటంతో అక్కడ ఓంకార నాదం వినిపించిందట. వెంటనే ఆ ప్రాంతంలో శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్టించాడట. శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్టించే కార్యక్రమంలో ఏడు కోట్ల బ్రహ్మాది దేవతలంతా పాల్గొనడంతో ఈ శివలింగాన్ని సప్త కోటి రామేశ్వర లింగంగా పిలుస్తారు. అయితే శివలింగాన్ని ప్రతిష్టించే సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఏడాదిలో 11 నెలలు నీటిలోనే ఉంచి ఒక్క వైశాఖ మాసంలో మాత్రమే భక్తులకు దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారట. అప్పటి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతోందని చెబుతారు.