పరమశివుడి నివాస స్థానం కైలాస పర్వతంగా చెబుతారు. ఈ పర్వతం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు పర్వత శ్రేణుల సమూహం. అందుకే దీనిని పంచ కైలాసమని పిలుస్తారు. ఈ కైలాస పర్వతంపై ఉన్న శివయ్య కోసం భక్తులు చేపట్టే యాత్రను మానస సరోవర యాత్ర అని పిలుస్తారు. ప్రతి ఒక్క హిందువూ జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్రను చేపట్టాలని భావిస్తుంటారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఈ యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ యాత్ర చేయాలనుకునే వారు మే 13 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఢిల్లీ నుంచి ప్రారంభం కానున్న తొలి యాత్రకు ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక పంచ కైలాస పర్వతంలోని ఐదింటి గురించి తెలుసుకుందాం.
కైలాష్ మానసరోవర్: ఇది టిబెట్లో ఉంది. దీనిని శివపార్వతుల నివాస స్థలంగా పిలుస్తారు. దీని ప్రస్తావన శివపురాణంలో ఉంది.
ఆది కైలాష్ : ఇది ఉత్తరాఖండ్లో ఉంది. రుంగ్ సమాజంతో సంబంధమున్న ప్రజలు ఇక్కడ ఉంటారు. వీరి సంప్రదాయం ప్రకారం.. సాధువులు, ఇతర వ్యక్తుల రాకతో శివయ్య తపస్సుకు భంగం కలగడంతో ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్లిపోయాడట.
కిన్నౌర్ కైలాష్: ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దీని యాత్ర.. అమర్నాథ్, మానసరోవర్ యాత్ర కంటే కష్టతరమైనదిగా చెబుతారు.
మణిమహేష్ కైలాష్: ఈ కొండ కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉంటుంది. ఈ ప్రదేశంలో శివలింగం ఆకారంలో ఉన్న రాయినే మహాదేవుని రూపంగా భావిస్తారు. పురాణాల ప్రకారం పార్వతి దేవినితో వివాహానంతరం శివుడు మణిమహేష్ కైలాసాన్ని నిర్మించాడని చెబుతారు.
శ్రీఖండ్ మహాదేవ్ కైలాష్: ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది. ఇది అత్యంత ఎత్తైన ప్రదేశం. సముద్ర మట్టానికి 18,300 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడే మహావిష్ణువు.. భస్మాసురుడనే రాక్షసుడిని సంహరించాడని ప్రతీతి.