
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచారు. ఇక్కడ శ్రీరామనవమి నాడు స్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణోత్సవ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా గురువారం హరిధ్రా ఘటనం – పసుపు దంచే సాంప్రదాయ కార్యక్రమం ప్రారంభమైంది. హిందూ సనాతన ధర్మంలో, ఏదైనా శుభ కార్యక్రమం లేదా సాంప్రదాయ కార్యక్రమాలు పసుపు పొడి తయారీతో ప్రారంభమవుతుంది.
ఆలయ అర్చకులు శ్రీ మనోజ్ స్వామి మాట్లాడుతూ , హరిధ్రా ఘటనం సమయంలో తయారు చేసిన పసుపు పొడిని వార్షిక బ్రహ్మోత్సవాలలో అభిషేకం, కళ్యాణం, అక్షింతలు తయారీలోను, పలు శుభకార్యాల్లో ఉపయోగిస్తారన్నారు. వందలాది మంది మహిళా భక్తులు, శ్రీవారి సేవకులు రామనామ స్మరణతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. టిటిడి మహిళా ఉద్యోగులు ఈ శుభ సందర్భంగా ”సారె” సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, పిఆర్వో (ఎఫ్ఎసి) కుమారి నీలిమ, ఎస్వీబీసీ ఓఎస్డీ శ్రీమతి పద్మావతి, అర్చకులు శ్రీ వీణా రాఘవాచార్యులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
