దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతిగాంచిన భద్రాద్రి రామయ్య కల్యాణం అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఇక ఆ తదుపరి రోజు రామ్య పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా పట్టాభిషేక మహోత్సవంలో ఒక్కటిగా సీతారాములు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరై సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
శ్రీరామ పట్టాభిషేకానికి పట్టు వస్త్రాలు, పట్టాభిషేకం మహోత్సవ ఆయుధాలు, అలంకరణలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. కల్యాణం మాదిరిగానే మిథిలా స్టేడియంలోనే రాముల వారి పట్టాభిషేకోత్సవం నిర్వహించారు. రామయ్యకు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, శంఖుచక్రాలు, రాజముకుటం, ముత్యాల హారం వంటివి వేద మంత్రాల నడుమ వేద పండితులు అలంకరించారు. పట్టాభిషేకంలో 500 పుణ్యనదీ జలాలతో పాటు నాలుగు సముద్ర జలాలతో కూడిన కలశాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తున్నంత సేపు భక్తులంతా పెద్ద ఎత్తున శ్రీరామ నామస్మరణ చేశారు.