ఒంటిమిట్టలో ఇవాళ సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు చెప్పారు. ఒంటిమిట్ట ఆలయ ప్రాంగణంలోని పరిపాన భవనం మీటింగ్ హాల్లో ఛైర్మన్, ఈవో శ్రీ జె.శ్యామలరావు, జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీధర్ చెరుకూరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, జెసి అదితి సింగ్, ఎస్పీ శ్రీ ఈజీ. అశోక్ కుమార్, సివిఎస్వో శ్రీ హర్షవర్థన్ రాజుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. ఏకశిలానగరంలో ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణాన్ని టిటిడి, జిల్లా యంత్రాంగం సమన్వయంతో వైభవంగా నిర్వహిస్తాం.
ముఖ్యమంత్రివర్యులు పట్టువస్త్రాలు సమర్పణ
శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా ఏప్రిల్ 11న సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
ఇంజినీరింగ్:
కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 147 గ్యాలరీలలో 60 వేల మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేశాం.
ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపట్టాం.
కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశాం.
కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాం.
నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశాం. ఇందులో పానకం, మజ్జిగ, చలివేంద్రం, వాటర్ కూలర్లు, పోలీస్, మెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నాం.
ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు, క్యూ లైన్లలో వెళ్ళెందుకు జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశాం.
శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 23 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశాం.
నిఘా మరియు భద్రత:
టీటీడీ విజిలెన్స్ విభాగం నుండి 400 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి 2500 మంది భద్రతా సిబ్బందిని నియమిస్తున్నాం.
అదేవిధంగా 130 సిసి కెమెరాలు, 07 డ్రోన్ లు ఏర్పాటు.
కామన్ కమెండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాం.
ఫైర్ ఇంజన్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలను ఏర్పాటు చేశాం.
కళ్యాణానికి విచ్చేసి భక్తులు వాహనాల పార్కింగ్ కొరకు సాలాబాద్ వద్ద 2, సాయి నగర్ వద్ద 3 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశాం.
సాలాబాద్ జంక్షన్ నుండి సాయినగర్ వరకు దాదాపు 21 కి.మీ మేర లైటింగ్, సూచిక బోర్డులు, మొబైల్ పెట్రోలింగ్, పర్యవేక్షణ టీంలు ఏర్పాటు
అన్నప్రసాదాలు:
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో, కల్యాణ వేదిక వద్ద అన్నప్రసాద వితరణ జరుగుతొంది.
కల్యాణాన్ని వీక్షించేందుకు గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు సాయంత్రం నుండి లెమన్ రైస్, చక్కర పొంగలి, బిస్కెట్ ప్యాకెట్, కారాసు అందిస్తాం.
దాదాపు 3 లక్షల తాగునీరు బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తాం.