
ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజ్లో మహా కుంభమేళా జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 13 నుంచి 26 వరకూ ఈ మహా కుంభమేళా జరగనుంది. ఈ కుంభమేళాకు 40 కోట్ల మంది హాజరవుతారని అంచనా. ఈ క్రమంలోనే కుంభమేళాకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కుంభమేళా కోసం 140 సాధారణ రైళ్లు.. అలాగే ఆరు ప్రధాన పండుగల సమయంలో 1225 ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడపనుంది. ప్రయాగ్రాజ్లో స్నానానంతం అయోధ్య, కాశీని సందర్శించాలనుకునే యాత్రికుల కోసం కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
ప్రయాగ్రాజ్, ప్రయాగ్, అయోధ్య, వారణాసి, రాంబాగ్ మొదలైన ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్ళు ఆగుతాయి. చిత్రకూట్ను సందర్శించాలనుకునే యాత్రికుల కోసం, ఝాన్సీ, బందా, చిత్రకూట్, మాణిక్పూర్, ప్రయాగ్రాజ్, ఫతేపూర్, గోవింద్పురి , ఒరాయ్లను కవర్ చేసే మరో రింగ్ రైలు సర్వీస్ ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఈ 1,225 ప్రత్యేక రైళ్లను సైతం రెండు భాగాలుగా విభజించారు. వాటిలో 825 రైళ్లు తక్కువ మార్గాల్లో నడవనున్నాయి. మరో 400 స్పెషల్ ట్రైన్స్ దూర ప్రాంతాల కోసం రిజర్వ్ చేసినట్లు తెలిపారు. కుంభమేళాకు వచ్చే యాత్రికుల కోసం రైల్వే శాఖ టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ – 1800-4199-139తో పాటు కుంభ్ 2025 మొబైల్ యాప్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ యాప్ కు 24×7 కాల్ సెంటర్ సపోర్ట్ చేస్తుంది.
