
శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మే 29వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూన్ 02 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.30 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.
బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. వేసవి నేపథ్యంలో చలువ పందిళ్లు, వైట్ పెయింట్, ఆలయం పరిసరాలలో ఆకట్టుకునేలా రంగోలీలు, విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్స్, పుష్పలంకరణ ఏర్పాట్లు చేపట్టారు.
