
భగవంతునిపై భక్తులు ఎన్నో పనులు చేస్తుంటారు. పాదయాత్ర చేస్తూ వెళ్లి దర్శించుకోవడం.. 108 ప్రదక్షిణలు చేయడం వంటివి చేస్తుంటారు. కానీ ఓ 92 ఏళ్ల వృద్ధురాలు మాత్రం అలా కాదు. పరమేశ్వరుడి కోసం 52 ఏళ్లుగా నైవేద్యం చేసి పెడుతోంది. అందులో విచిత్రమేముందంటారా? ఆమె సలసల కాగే నూనెలో చేయి పెట్టి మరీ అప్పం వేసి తీసి శివుడికి నైవేద్యం సమర్పిస్తుంటారు. ఆ నూనెను భక్తుల నుదుటికి సైతం రాస్తుంటారు. అసలు ఆ ఆలయం ఎక్కడుంది? ఆ వృద్ధురాలి కథేంటో తెలుసుకుందాం. ఆ వృద్ధురాలి పేరు ముత్తమ్మాళ్.
తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్ ముదలియార్పట్టి వీధిలోని భద్రకాళియమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయంలోనే ముత్తమ్మాళ్ అనే వృద్ధురాలు ఉంటుంది. ముఖ్యంగా శివరాత్రి రోజున అర్ధరాత్రి ఆలయ ప్రాంగణంలో బియ్యం, తాటిబెల్లంతో చేసిన లడ్డూల వంటి అప్పంను శివుడికి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ అప్పాన్ని వేడి నెయ్యిలో నుంచి గరిటె వాడకుండా ముత్తమ్మాళ్ తీస్తుంది. శివరాత్రికి ముందు ఆమె 40 రోజులపాటు వ్రతం చేస్తారు. ఆ తరువాత శివరాత్రి నాడు అప్పం చేశాక గుడికి వచ్చిన భక్తులు ఆ నెయ్యిని తలకు రాసుకొని, దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆలయ ప్రాంగణంలో పొయ్యి పెట్టి మరీ ముత్తమ్మాళ్ ప్రసాదం తయారు చేస్తుంది. ఇలా సలసల కాగే నూనెలో చేయి పెట్టి ప్రసాదాలు తయారు చేయడం.. అయినా ఆమె చేయి కాలకపోవడం శివయ్య మహిమేనని అంతా చెప్పుకుంటారు.
