ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణానికి వైభవంగా ఏర్పాట్లు..

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. ఒంటిమిట్టలోని పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, జిల్లా అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. టీటీడీ అధికారులు, కడప జిల్లా అధికారులు సమన్వయంతో ప్రణాళికా బద్ధంగా, నిర్మాణాత్మకంగా ఏర్పాట్లు చేయాలని కోరారు.

భక్తులకు అందరికీ ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలు అందేంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణానికి భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల తాకిడికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ మరియు పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు.శ్రీ సీతారాముల కళ్యాణం రోజున ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగ రాదని, అవసరమైన జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు, వేసవి నేపథ్యంలో అగ్ని మాపక శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆహ్వానం పత్రికలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు సేవలు అందించేందుకు అవసరమైన శ్రీవారి సేవకులను ఏర్పాటు చేయాలని, భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని కోరారు. అత్యవసర వైద్య సేవలు, అవసరమైన మందులు నిల్వ ఉంచాలన్నారు. శాఖలవారీగా అధికారులు చేయనున్న పనులను ఛైర్మన్ కు నివేదించారు. అంతకు ముందు కల్యాణ వేదిక ప్రాంగణాన్ని టిటిడి ఛైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు. కల్యాణ వేదిక ప్రాంగణాన్ని చక్కని పుష్ప, విద్యుత్ అలంకరణలతో అలంకరించాలని సూచించారు. భక్తుల ప్రవేశం, నిష్క్రమణ మార్గాల్లో పటిష్టంగా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వేసవి నేపథ్యం, అనుకోకుండా వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద చేపడుతున్న ఏర్పాట్లపై ఛైర్మన్ కు జేఈవో నివేదించారు.

Share this post with your friends