భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి రూ. లక్ష విరాళం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి కృష్ణా జిల్లాకు చెందిన వారు లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. పెనమలూరు మండలం, కానూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ – సౌజన్య దంపతులు ఈ విరాళాన్ని శనివారం అందజేశారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమానికి తమ వంతు సాయంగా ఈ విరాళం అందిస్తున్నట్టు చంద్రశేఖర్ దంపతులు వెల్లడించారు. ఆలయ అధికారులు వీరి ఉదారతను అభినందించారు. భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు.

మరోవైపు భద్రాద్రి రామయ్య కల్యాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఏప్రిల్ నెల‌లో సీతారామ చంద్రస్వామి వారి కల్యాణం కమనీయంగా జరుగనుంది. ఈ క్రమంలోనే హోలీ పండుగ నాడు ముత్తైదువులంతా పసుసు కొమ్ములు దంచి స్వామివారిని పెళ్లి కొడుకును చేశారు. ఇదే రోజున తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. ఈ ఏడాది 300 క్వింటాళ్లకు పైగా తలంబ్రాలు సిద్ధం చేయాలనే లక్ష్యాన్ని దేవస్థానం అధికారులు పెట్టుకున్నారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం 25 క్వింటాళ్ల తలంబ్రాలను ముత్తెదువుల సమక్షంలో భక్తులతో కలిసి తయారు చేశారు.

Share this post with your friends