
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన పండితులచే చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ రంగ రామానుజాచార్యుల ధార్మికోపన్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ మేటూరు బ్రదర్స్ బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.
అనంతరం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ రాముడు బృందం హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి విశాలాక్షి బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు ఊంజల సేవలో తిరుపతికి చెందిన శ్రీ మధుసూదన్ రావు బృందం బృందం అన్నమయ్య సంకీర్తనలను గానం చేశారు. అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటల నుండి తిరుపతికి చెందిన శ్రీ శివ నాట్య కళానిలయం వారిచే భరతనాట్యం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి హైదరాబాద్ కు చెందిన శ్రీ వెంకటేశ్వర్లు బృందం కూచిపూడి నృత్యం, రామచంద్ర పుష్కరిణి వద్ద మహబూబ్నగర్ కు చెందిన శ్రీ చంద్రశేఖర్ బృందం భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి శిల్పారామంలో విజయవాడకు చెందిన శ్రీ ఆనంద్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
