
భద్రాద్రి రామయ్య హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నేడు చేపట్టారు. మరోవైపు శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే స్వామివారి నిత్య కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జీలకర్ర బెల్లం పెట్టించడం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆలయం నుంచి ఆదాయ లెక్కింపు కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభమైంది.
ఇవాళ సాయంత్రానికి లెక్కింపు ప్రక్రియ పూర్తై వివరాలు వెల్లడించారు. ఈ లెక్కింపు ప్రక్రియను భద్రాద్రి రామయ్య ఆలయ ఈవో రమాదేవి పర్యవేక్షించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయం.. ఒక కోటి 13,23,178 రూపాయలు కానుకల రూపంలో సమకూరింది. బంగారం 109 గ్రాములు వచ్చింది. వెండి 895 గ్రాములు వచ్చింది. ఇది మాత్రమే కాకుండా విదేశీ ద్రవ్యం కూడా పెద్ద మొత్తంలో సమకూరింది. ఈ మొత్తాన్ని ఈఓ రమాదేవి బ్యాంకులో జమ చేశారు. ఇంతకు ముందు 2024 డిసెంబర్ 30న 37 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఆ తర్వాత లభించిన హుండీ ఆదాయం ఇది కావడం గమనార్హం.
