
శ్రీరాముని భక్తుడు తులసీదాసు.. ఆయనను కీర్తిస్తూ ఎన్నో రచనలు చేశాడు. వాటిలో రామాయణం, రామచరిత మానస్ వంటివి ప్రఖ్యాతిగాంచాయి. ఇవి మాత్రమే కాకుండా శ్రీరామునిపై తనకున్న భక్తిని తెలియజేసే గ్రంథాలను సైతం ఆయన రాశారు. వాటిలో తను కాశీలో నివసిస్తున్నప్పుడు జరిగిన ఓ యథార్థ గాధ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాశీ పట్టణంలో తులసీదాసుకు ఎక్కడికి వెళ్లినా సన్మాన సత్కారాలు జరిగేవి. ఇక శ్రీరాముని భక్తులకు అయితే తులసీదాసు మరింత ప్రియమైనవాడుగా మారిపోయాడు. భక్తుల సందేహాలను నివృత్తి చేస్తూ ఉండేవాడు.
ధనపాలుడనే పరమలోభి అయిన వ్యక్తి ఒకనాడు తులసీదాసు వద్దకు వచ్చి ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు. అదేంటంటే.. తనకు కూడా శ్రీరామచంద్రుని సకల ఉపచారాలతో అర్చించాలని ఉందని.. కానీ అలా చేయాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పాడు. అర్చనకు పూలు, పళ్లు, ధూప, దీపాదులకు చాలా వ్యయం చేయాల్సి ఉంటుంది. వీటికి దమ్మిడీ వ్యయం చేయకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పమని తులసీదాసును ధనపాలుడు అడిగాడు. ఆ వింత ప్రతిపాదనకు ఆశ్చర్యపోయిన తులసీదాసు కాసేపు మౌనం వహించి.. అతనితో ‘నీవు అడిగిన దానికి మానస పూజ మినహా వేరే మార్గం లేదు’ అని చెప్పాడు. అప్పుడు మానస పూజ వివరాలను లోభి అడగడంతో తులసీదాసు వివరించాడు.
