
ధనపాలుడికి దమిడి ఖర్చు కాకుండా శ్రీరాముని సకలోపచార పూజ పూర్తి కావాలంటే మానస పూజ చేయమని తులసీదాసు చెప్పాడు. అయితే మానస పూజ అంటే ఏమిటో ధనపాలుడికి తెలియలేదు. అప్పుడు అతని కోరిక మేరకు తులసీదాసు మానస పూజ గురించి వివరించడం మొదలు పెట్టాడు. మానసపూజ అంటే ఏమీ లేదు.. చేసే ఉపచారాలన్నీ కాల్పనికాలు అని తులసీదాసు తెలిపాడు. ‘కాల్పనికాలు అంటే చేస్తున్నట్టుగా ఉహించుకోవడమే.. మనసులోనే నీవు దేవునికి అన్ని ఉపచారాలు చేస్తున్నట్లు ఊహించుకుంటూ పూజ పూర్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ విధానంలో పైసా ఖర్చు ఉండదు’ అని తులసీదాసు తెలిపాడు.
తులసీదాసు చెప్పిన మానసపూజ వివరాలు తెలుసుకున్నాక ధనపాలుని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. పైసా ఖర్చు లేని ఇలాంటి పూజ కోసమే అతను ఇంతకాలం ఎదురుచూశాడు. అసలే పరమ లోభి అయిన ధనపాలుడికి ఊహలో కూడా దేవునికి ఎక్కువగా పదార్థాలు నివేదించేందుకు మనసు రాలేదు. అందుకే ఆ పూజ గురించి మరింత లోతుగా తెలుసుకునే యత్నం చేశాడు. మానస పూజను ఏ విధంగా మానసపూజ చేయాలో వివరంగా చెప్పాలని తులసీదాసును ధనపాలుడు అడిగాడు. అప్పుడు తులసీదాసు.. ‘‘ముందుగా మానసపూజలో శ్రీరామచంద్రుని ప్రతిమను బంగారు సింహాసనంపై ప్రతిష్ఠించి రకరకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించాలి. ఆపై వేడి చేసిన ఆవు పాలల్లో కాస్తంత పంచదార కలిపి నివేదన చేయాలి. రామయ్య పంచదార లేకుండా పాలు తాగడు కాబట్టి పొరపాటున కూడా కలపడం మరువకూడదు. అనుదినం ఈ విధంగా మానసపూజ చేస్తే పైసా ఖర్చు అవదు’’ అని మానసపూజను పూర్తి చేశాడు.
