ఇక్కడి అనంత పద్మనాభుడి ఆలయ విశేషాలేంటంటే..

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలో ఉన్న అనంతపద్మనాభుడి గుహాలయ విశేషాల గురించి చెప్పాలంటే.. ఒకే కొండను నాలుగంతస్తుల గుహాలయాలుగా తొలచడం జరిగింది. అనంతరం వాటిని విశాలమైన విహారాలుగా, మందిరాలుగా, అందమైన స్థంభాలుగా, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులుగా వివిధ ఆకృతుల్లో మలచారు. వారి శిల్ప నైపుణ్యం ప్రతి ఒక్కరినీ అబ్బుర పరుస్తుందనడంలో సందేహమే లేదు. గుహాలయంలో శ్రీ అనంత పద్మనాభుని 20 అడుగుల ఏకశిలా విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.

నాలుగు అంతస్థులతో ఉన్న ఈ గుహాలయంలోని విశేషాలను తెలుసుకుందాం. ఉండవల్లి గుహాలయంలో తొలి అంతస్తులో గుప్తుల, చాళుక్యుల కాలపు శిల్ప నిర్మాణం కనిపిస్తాయి కానీ అవన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. తొలుత బౌద్ద సన్యాసుల విహారాలుగా ఉండేటట్లుగా ఈ గుహాలయాల నిర్మాణం ప్రారంభమైంది. ఈ గుహల్లో ఒక గుహ నుంచి ఇంకో గుహలోకి వెళ్ళడానికి మార్గంతో పాటు విశాలమైన తిన్నెల నిర్మాణాన్ని ఇక్కడ చూడవచ్చు. ఒకటో అంతస్తుకు వెళ్లిన తర్వాత రెండో అంతస్తుకు వెళ్లేందకు మెట్ల మార్గం ఉంటుంది. గతంలో ఈ రెండో అంతస్తులో త్రిమూర్తుల మందిరాలున్నాయట. కానీ వాటి అవశేషాలు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి. త్రిమూర్తుల ఆలయాలు ఉన్నట్లుగా చెప్పే మందిరాలకు సన్నని తీగలున్న తలుపులు ఉంటాయి. ఇవి మూసేసి ఉంటాయి. వీటి వెనుక చీకట్లో ఏవేవో దేవతామూర్తులను పెకలించిన గుర్తులు మాత్రం అస్పష్టంగా కన్పిస్తాయి.

Share this post with your friends