సాధారణంగా ఏ ఆలయంలోనైనా శివుడు దాదాపుగా లింగరూపంలోనే దర్వనమిస్తాడు. జ్యోతిర్లింగాల మొదలు.. పంచారామాలు, పంచభూత క్షేత్రాల వరకూ అన్ని ఆలయాల్లోనూ లింగరూపంలోనే భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే ఓ ఆలయంలో మాత్రం మానవ ఆకారంలో మనకు దర్శనమిస్తాడు. అత్యంత అరుదుగా మానవ ఆకారంలో కనిపించే ఈ శివయ్యను దర్శించుకోవాలంటే మనం ఎక్కడకు వెళ్లాలి? ఆ శివయ్య విశేషాలేంటో తెలుసుకుందాం. పరమేశ్వరుడు మానవాకారంలో కొలువుదీరిన క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరకు సమీపంలో అమరాపురం మండలం హేమావతి గ్రామంలో ఉంది.

హేమావతి గ్రామంలో.. ఆదియోగి అయిన పరమేశ్వరుడు లింగాకారంలో కాకుండా మానవాకారంలో కొలువై ఉండగా, నిలువెత్తు స్వామి రూపంతో పాటు మరో నాలుగు శివలింగాలు సైతం ఇక్కడ కొలువయ్యాయి. కాబట్టి దీనిని పంచలింగ శైవక్షేత్రంగా పిలుస్తారు. దీనికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పంచలింగాల క్షేత్రం హేమావతి సిద్ధేశ్వరస్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. అతి ప్రాచీన నిర్మాణ శైలితో, అబ్బురపరిచే శిల్పకళా నైపుణ్యంతో భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపు 15 ఎకరాల సువిశాల ప్రాంగణంలో వెలసిన హేమావతి సిద్ధేశ్వరస్వామి ఆలయం దేశంలోని అరుదైన శైవ క్షేత్రాల్లో ఒకటి కావడం విశేషం. ఈ ఆలయంలో శివుడు మానవ రూపంలో సిద్ధయోగిగా దర్శనమివ్వడం విశేషం.
