ద్వాదశ జ్యోతిర్లింగాల్లో తొలి మూడింటి గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సకల పాపాలనూ పోగొట్టే ఓంకారేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం శివుడి ఢమరుక నాదం నుంచి తొలి ధ్వనిగా ఓంకారాన్ని చెబుతారు. ఓంకారాన్ని సాక్షాత్తు మహేశ్వరుడి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. ఓకారం అనేదే సృష్టికి మూలంగా కూడా చెబుతారు. అందుకే శివుడిని ఓంకారేశ్వరుడిగా పిలుస్తారు. జ్యోతిర్లింగ రూపంలో పరమేశ్వరుడు.. ఓంకారేశ్వరుడిగా వెలిసిన క్షేత్రమే ఓంకారేశ్వరం. అసలు ఈ క్షేత్రం ఎక్కడ ఉంది? దీని విశేషాలేంటి? వంటి విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఓంకారేశ్వర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగోది. ఈ క్షేత్రం పవిత్ర నర్మదా నదీ తీరంలో వెలసిన ఈ క్షేత్రంలో గొప్ప విశేషముంది. ఆత్మ, పరమాత్మలకు ప్రతీకగా శివుని వరంతో జ్యోతిర్లింగం రెండుగా చీలిపోయిందట. అలా చీలిపోయిన వాటిలో ఒకటి ఓంకారేశ్వర ప్రణవ లింగంగా, రెండోది మమలేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించింది. అందుకే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో కూడా దీని గురించి ప్రస్తావించారు. అయితే ఈ క్షేత్రాన్ని గురించి ‘ఓంకారమమలేశ్వరమ్” అని ప్రస్తావిస్తారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. ఈ ఓంకారేశ్వర క్షేత్రంలో శివుడు ఆసక్తికరంగా ఒకటిగా కాకుండా రెండు జ్యోతిర్లింగాల రూపంలో పూజలందుకోవడం విశేషం.
