అతి పురాతన జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర క్షేత్రం భక్తుల పాలిట కైలాసంగా విరాజిల్లుతోంది. ఆత్మ, పరమాత్మలకు ప్రతీకగా శివుని వరంతో జ్యోతిర్లింగం రెండుగా చీలిపోయిందని తెలుసుకున్నాం కదా. వాటిలో ఒకటి.. ప్రణవలింగంగా.. రెండోది మమలేశ్వర లింగంగా ఆవిర్భవించింది. ఇక్కడ ఓంకారేశ్వర్ మాత్రమే కాకుండా పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతమున్న ఉపాలయాల్లో.. పరిశుద్ధనాథ్, వైద్యనాథ్, మహాకాళేశ్వర్, కేదారీశ్వర్, గుప్తనాథ్ ఆలయాలున్నాయి. ఈ అయిదు ఆలయాలను కలిపి పంచలింగ ధామాలుగా పిలుస్తారు.

నిత్యం పవిత్ర నర్మదా నదీ జలాలతో ఈ క్షేత్రం పునీతమవుతూ ఉంటుందని చెబుతారు. అలాంటి ఆలయాన్ని జీవితంలో ఒక్కసారి దర్శించినా జన్మ ధన్యమవుతుందని చెబుతారు. ఈ క్షేత్రంలో శివుడిని ఒక పద్ధతి ప్రకారం దర్శించుకోవాలి. అంటే ముందుగా ఓంకారేశ్వరుడిని, ఆపై మమలేశ్వరుడిని దర్శించుకోవాలి. పూర్వం రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించుకుని దేవతలను హింసించడం ప్రారంభించగా ఆ సమయంలో శివుడిని ఇంద్రుడు ప్రార్థించాడు.
అప్పుడు జ్యోతి స్వరూపుడైన ఓంకారేశ్వరుడే స్వయంగా పాతాళ లోకం నుంచి లింగాకారంలో వెలిసి.. రాక్షసుల బారి నుంచి దేవతలను కాపాడాడట. అనంతరం స్వర్గాన్ని తిరిగి దేవతలకు అప్పగించాడని చెబుతారు.
