శబరిమల ఆలయం మాదిరిగానే ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా పూజలు వంటివన్నీ జరుగుతాయా? అలాగే జరుగుతాయి. ద్వారపూడిలోనూ స్వామి దర్శనానికి వెళ్లేందుకు పద్దెనిమిది మెట్లు ఉంటాయి. అలాగే ఈ పద్దెనిమిది మెట్లను ఏకశిలతోనే నిర్మించడం జరిగింది. శబరిమల సంప్రదాయ రీతిలోనే ద్వారపూడి అయ్యప్ప ఆలయంలో కూడా పూజలు జరుగుతాయి. నిత్యం స్వామివారికి పాలతో పాటు నెయ్యితో అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. శబరిమలలో సంక్రాంతి పండుగ నాడు మకరజ్యోతి దర్శనం ఉంటుంది. మరి ద్వారపూడిలో ఉంటుందా?

కచ్చితంగా ఉంటుంది. ద్వారపూడిలోనూ సంక్రాంతి నాడు మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఈ మకరజ్యోతిని దర్శఇస్తే జన్మరాహిత్యం కలిగి మోక్షం లభిస్తుందని చెబుతారు. కేరళ శబరిమల ఆలయాన్ని భక్తులు చాలా భక్తి ప్రపత్తులతో దర్శించుకుంటూ ఉంటారు. అన్ని రకాలుగా ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయాన్ని అచ్చుగుద్దినట్టుగా అన్ని విషయాల్లోనూ పోలి ఉంటుంది కాబట్టి శబరిమలకు వెళ్లలేని వారంతా తమ ఇరుముడిని ద్వారపూడిలో అప్పగిస్తారు. మకర సంక్రాంతి నాడైతే ఇసుకేస్తే రాలనంత మంది భక్తులతో ఆలయం నిండిపోతుంది. కార్తిక మాసమంతా కూడా రద్దీ కొనసాగుతూనే ఉంటుంది.
