టీటీడీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లలో విజేతలుగా నిలిచే స్థాయికి తయారుకావాలని కోరారు. వచ్చే ఏడాదికి యువతతో పటిష్ట టీంలను తయారు చేయాలని సూచించారు. ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. టీటీడీ ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఉద్యోగుల సంక్షేమం, వారి మానసిక వికాసం కోసం 1977వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు ఉద్యోగులతో క్రీడాప్రతిజ్ఞ చేయించారు. ముందుగా ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో, జేఈవో కలిసి క్రీడాపతాకాన్ని ఆవిష్కరించారు. బెలూన్లు, శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది భక్తులకు ఉద్యోగులు విశేషసేవలు అందిస్తున్నారని, ఈ నేపథ్యంలో పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుందని, వాటిని నియంత్రించడం క్రీడల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. టిటిడి ఉద్యోగులు సమిష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతీ బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమిని విజయవంతం చేశారని అభినందించారు. టిటిడి ఉద్యోగులలో క్రీడా స్పూర్తి, స్నేహపూర్వక వాతావరణం, సమిష్టి కృషి, మనోదైర్యం కోసం క్రీడలు చాలా ఉపయోగపడతాయన్నారు. ప్రతి రోజు ఉద్యోగులు క్రీడలలో భాగస్వాములు కావడం మూలంగా వారిలో క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం, శారీరక పటుత్వం పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొనాలని సూచించారు. ఈ పోటీల్లో మొదటి స్థానం గెలుచుకున్న వారికి రూ.2వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.1800/-, మూడో స్థానంలో నిలిచినవారికి రూ.1600/- విలువగల బ్యాంకు గిఫ్ట్కార్డులు బహుమతులు అందజేస్తామన్నారు.