యూకే నుంచి శ్రీవారి సేవకు వచ్చిన భక్తురాలిని అభినందించిన టీటీడీ

శ్రీవారి సేవ కోసం ఖండాంతరాలు దాటి తిరుమలకు విచ్చేసిన రీతూ వక్కలంక అనే మహిళను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం అభినందించారు. ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈవో, అదనపు ఈవోలను కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. తాను లండన్ లో ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్నానని, శ్రీ మలయప్ప స్వామి సేవ చేయడానికే యూకే నుండి తిరుమలకు వచ్చానని తెలిపారు.

తనకు 30 రోజులు సేవ చేసుకునే అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. అన్న ప్రసాద కేంద్రంలో వేలాదిమంది భక్తులకు టీటీడీ చేస్తున్న అన్న ప్రసాద వితరణ సాధారణ విషయం కాదని, టీటీడీ యంత్రాంగం పక్కా ప్రణాళికతో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండటం అభినందనీయమన్నారు. స్వామిపై భక్తిభావంతో యూకే నుంచి తిరుమలకు వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవ ద్వారా సామాన్య భక్తులకు విశేష సేవ చేయడం గొప్ప విషయమని ఆమెను ఈవో, అదనపు ఈవోలు అభినందించారు.

Share this post with your friends