ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా తిరుమల మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ పాలకమండలి సభ్యులు, టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇంఛార్జి సివిఎస్వో శ్రీ మణికంఠ చందోలుతో కలిసి శుక్రవారం సాయంత్రం ఛైర్మన్ పరిశీలించారు. తిరుమల మాడ వీధుల్లో భక్తుల సౌకర్యార్థం వేసిన చలువ పందిళ్లను, గ్యాలరీల్లోకి భక్తుల ప్రవేశం, నిష్క్రమణ, అత్యవసర గేట్లను, భక్తులు నడిచే సమయంలో వేడి లేకుండా వైట్ పెయింట్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. గ్యాలరీలలోని భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా సమాచారం చేరవేసేలా ప్రకటనలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.
భక్తులు గ్యాలరీలోకి ప్రవేశించాక వారికి కావాల్సిన అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను క్రమం తప్పకుండా అందించాలని కోరారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులు సౌకర్యవంతంగా శ్రీవారి వాహన సేవలను వీక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తొలుత వాహన మండపానికి చేరుకున్న టీటీడీ ఛైర్మన్, పాలక మండలి సభ్యులు, టీటీడీ ఈవో, అదనపు ఈవో, తిరుపతి జేఈవో, ఇంఛార్జి సివిఎస్వో, టీటీడీ అధికారులు నాలుగు మాడ వీధుల్లో కలియ తిరిగారు. ఈ తనిఖీల్లో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ ఎమ్మెస్ రాజు, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ ఆనంద్ సాయి, శ్రీ శాంతారామ్, శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ నరేష్, శ్రీ నర్సీ రెడ్డి, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మణికంఠ చందోలు, సీఈ శ్రీ సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.