తిరుమల తిరుపతి దేవస్థానం కియోస్క్ మిషన్ను ప్రారంభించింది. టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్(KIOSK) మిషన్ ను టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తాజాగా ప్రారంభించారు. ఈ మిషన్ ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీకి విరాళంగా అందించింది.
ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా విరాళం ఇవ్వవచ్చు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, ఐటీ డీజీఎం శ్రీ బి.వెంకటేశ్వర నాయుడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి రీజనల్ హెడ్ శ్రీ జి .రామ్ ప్రసాద్, డిప్యూటీ రీజనల్ హెడ్ శ్రీ వి.బ్రహ్మయ్య, ఇతర అధికారులు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.