శ్రీవారి సేవ స్వచ్చంద సేవ జూన్ నెల ఆన్లైన్ కోటాను ఏప్రిల్ 30న టీటీడీ విడుదల చేయనుంది
విడుదల సమయ వివరాలు:
– జనరల్ శ్రీవారి సేవ (తిరుమల మరియు తిరుపతి) – ఉదయం 11:00 గంటలకు
– నవనీత సేవ (మహిళలకు మాత్రమే) – మధ్యాహ్నం 12:00 గంటలకు
– పరకామణి సేవ (పురుషులకు మాత్రమే) – మధ్యాహ్నం 1:00 గంటలకు
– గ్రూప్ లీడర్ సేవ (కొత్తగా ప్రారంభించిన సేవ) – మధ్యాహ్నం 2:00 గంటలకు
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు శ్రీవారి సేవ యొక్క నాణ్యతను మెరుగుపరిచి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ అధికారులు శ్రీ సత్యసాయి సేవా సంస్థ (పుట్టపర్తి), ఇషా ఫౌండేషన్ (కోయంబత్తూర్), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు) వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించి అధ్యయనం చేశారు.
ఈ అధ్యయనం ఆధారంగా శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. ఈ మార్పులు ఏప్రిల్ 30న కొత్తగా రూపొందించిన అప్లికేషన్ ద్వారా అమలులోకి రానున్నాయి.
ముఖ్యాంశాలు
ఇకపై ”గ్రూప్ లీడర్స్గా” సీనియర్ సేవకులు
గత రెండు సంవత్సరాలుగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు సేవలో పాల్గొంటున్నారు. వయస్సు 45 సంవత్సరాలు నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్న వారు నమోదు కావచ్చు. ఇప్పుడు వీరిని “గ్రూప్ లీడర్స్” అని పిలుస్తారు. వీరు 15 రోజుల, ఒక నెల లేదా మూడు నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్లైన్లో ఎంపిక చేసుకోవచ్చు.
గ్రూప్ లీడర్స్ బాధ్యతలు
ఈ గ్రూప్ లీడర్స్ శ్రీవారి సేవకుల పనిని పర్యవేక్షించడం, సేవకు వారి హాజరు తీసుకోవడం, మరియు ప్రతి ఒక్క సేవకుని/సేవకురాలి పనితీరును మూల్యాంకనం(Rating) చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు.
పరకామణి సేవలో జనరల్ పురుష సేవకులకు అవకాశం
కనీసం పదో తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు పరకామణి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఆన్ లైన్ ద్వారా పరకామణి సేవను బుక్ చేసుకోవచ్చని తెలియజేయడమైనది.