తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు బుధవారం సాయంత్రం శ్రీ పురందరదాసులవారి కీర్తనలతో మారుమోగాయి. శ్రీ పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. ఈ సందర్భంగా చల్లటి సాయంత్రం వేళ నిర్వహించిన ఊంజల్సేవలో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపచేసింది.
టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో జరిగిన ఈ కార్యక్రమం ఆహుతులను భక్తి పారవశ్యంలో ముంచేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, ఇతర అధికారులు, 3,500 మందికి పైగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక చెందిన భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.