19న తిరుమలలో ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ‘ఈ-వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైక్లింగ్‌ చేయడం’ అనే థీమ్‌ను ఈ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఎంచుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ-వేస్ట్‌ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌’ అనే నినాదంతో ఈ-వ్యర్థ సేకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. ‘చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారమైన ఏప్రిల్ 19న తిరుమలలో సైతం సామూహిక శ్రమదానాన్ని టీటీడీ నిర్వహించనుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రం చేయనున్నారు. అలిపిరి నడక దారిలోని కుంకాల పాయింట్ (ఆఖరి మెట్టు) వద్ద నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

Share this post with your friends