శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులు తిరుమలలో సులభంగా వసతి పొందేలా చర్యలు చేపట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలియజేశారు. ఆదివారం తిరుమలలోని గరుడాద్రి నగర్ కాటేజీ వద్ద ఆధునీకరించిన ఉప విచారణ కార్యాలయాన్ని అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్యతో కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.
అందులో భాగంగా తిరుమలలోని అన్ని వసతి గదులు, విశ్రాంతి గృహాలు వద్ద సర్వే నిర్వహించి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తిరుమలలోని 42 ఉప విచారణ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ గదుల కరెంట్ బుకింగ్ లో కేంద్రీయ విచారణ కార్యాలయంపై అధిక భారం పడుతుండటంతో గదుల కేటాయింపు ప్రక్రియను వికేంద్రికరించినట్లు చెప్పారు. ఉప విచారణ కార్యాలయాల వద్ద గదులు పొందడం, ఖాళీ చేయడం సులభతరమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి, సీవీఎస్వో శ్రీధర్, సిఈ శ్రీ సత్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.