6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయం శ్రీరామనవమికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 06వ తేదీన శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు.

కాగా సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. ఆ త‌రువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. అదేవిధంగా, ఏప్రిల్ 07న శ్రీ రామ పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని, రాత్రి 8 నుండి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు నిర్వహిస్తోంది.

Share this post with your friends