శ్రీవారి భక్తులకు జనవరి 10 నుండి 19వ తేదీ వరకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన సమీక్షా సమావేశంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మరియు తిరుమలలో ఎస్ఎస్డి టోకెన్ల జారీ, వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారి ఆలయంలో కైంకర్యాల నిర్వహణ, భక్తుల భద్రత, దర్శనం, వసతి, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ, అన్నప్రసాదం మరియు ఇతర ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
తరువాత వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా విచ్చేసి భక్తుల రద్దీ కోసం వివిధ పార్కింగ్ ప్రాంతాలను కేటాయించడం ద్వారా ట్రాఫిక్ నిర్వహణనకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వైకుంఠ ఏకాదశి ముఖ్యాంశాలతో సమగ్ర మాస్టర్ డాక్యుమెంట్ రూపొందించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు అధికారులు వివరించారు. ఇది ప్రస్తుత మరియు భవిష్యత్తు సంవత్సరాలకు అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ప్రసిద్ధ మైసూర్ దసరా ఉత్సవాలలో విద్యుత్ దీపాలంకరణలు అందించే మైసూర్ నిపుణులు ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల, తిరుపతిలలో విద్యుత్ అలంకరణలు చేయనున్నారు. అదేవిధంగా ప్రత్యేకమైన పౌరాణిక పాత్రలతో కూడిన పూల అలంకరణలు ఏర్పాటు చేయనున్నారు.