దాససాహిత్య పితామహుడు శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా బుధవారం ఉదయం అలిపిరి వద్ద గల శ్రీ పురందరదాసుల విగ్రహనికి పలువురు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ముందుగా భజనమండళ్ల సభ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు, ఇతర ఆధికారులు, భక్తులు పాల్గొన్నారు.
తిరుమల ఘాట్ రోడ్ల విషయమై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఘాట్ రోడ్ల సుందరీకరణకు సంబంధించిన పనులను మొదలు పెట్టారు. దీనిలో భాగంగా తిరుమల- తిరుపతి మొదటి ఘాట్ రోడ్డులో, అలాగే మొదటి ఘాట్ రోడ్డు చివరన ఉన్న గరుడాద్రి పర్వత శ్రేణుల వద్ద హై ఫోకస్డ్ ల్యాంప్స్ను ఏర్పాటు చేశారు. దీనివల్ల రాత్రివేళ తిరుమలగిరులు మరింత శోభాయమానంగా కనిపిస్తాయి. గతంలోనూ ఈ ఏర్పాటు కొంత మేర జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. మొత్తానికి ఈ ఏర్పాటుతో రాత్రివేళ తిరుమలగిరులు శోభాయమానంగా వెలిగిపోతున్నాయి.