రథసప్తమికి సర్వం సిద్ధం.. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా

రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో చేసిన ఏర్పాట్లను సోమవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు. గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు వంటి సౌకర్యాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు, విజిలెన్స్ సమన్వయంతో మాడ వీధుల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ మంగళవారం రథసప్తమి పర్వదినం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. రేపు ఉదయం నుండి రాత్రి వరకు ఏడు వాహనాలపై స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతారని తెలిపారు.

రథ సప్తమి సందర్భంగా రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వేసవి తాపం కలగకుండా షెడ్లు ఏర్పాటు చేశామని, మాడ వీధుల్లో ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు అన్న ప్రసాదాలు పంపిణీ నిరంతరంగా కొనసాగుతుందన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు రెట్లు అధిక భద్రత కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఇన్ ఛార్జ్ సీవీఎస్వో శ్రీ మణికంఠ చందోలు, జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఎఫ్ఏ అండ్ సీఏఓ శ్రీ బాలాజీ, సీఈ శ్రీ సత్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends