రథసప్తమికి అన్ని శాఖల విభాగాల అధికారులకు టీటీడీ బాధ్యతలు

రథసప్తమికి వచ్చే భక్తులకు ఉద్యోగులు సమిష్టిగా, ప్రణాళికాబద్ధంగా సేవలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు కోరారు. తిరుమల ఆస్థాన మండపంలో భక్తులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన అధికారులు, సిబ్బందిలతో ఆదివారం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో, టీటీడీ అదనపు ఈవో, టీటీడీ జేఈవో, ఇన్‌చార్జి సివిఎస్వో, తిరుపతి ఎస్పీ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రథసప్తమి రోజున గ్యాలరీలలో భక్తులకు అందించే సేవలపై ముందస్తుగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసుకుని సమిష్టిగా విధులు నిర్వర్తించాలని కోరారు. ప్రతి గ్యాలరీకి ఇంఛార్జితో పాటు , అన్ని శాఖల విభాగాల అధికారులకు బాధ్యతలను అప్పగించామన్నారు.

పోలీసులు, విజిలెన్స్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి ఉద్యోగి కూడా సంబంధిత విభాగాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నదానం, పోలీసు, విజిలెన్స్, ఇంజనీరింగ్, వైద్య, ఆరోగ్య, శానిటేషన్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఉమ్మడి కార్యాచరణతో సేవలు అందించాలని కోరారు. ఉన్నత ప్రమాణాలతో శానిటేషన్ సేవలు అందించాలని సూచించారు. అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా పనిచేయాలని కోరారు. చేయాల్సిన, చేయకూడని పనుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా భక్తులకు సేవలు అందించాలన్నారు.

చక్రస్నానం రోజున ఉద్యోగులు తమకు అప్పగించిన ప్రాంతాల్లో విధులను నిర్వర్తించాలని కోరారు. నాలుగు మాడ వీధుల్లో దాదాపు 200 గ్యాలరీలు, 66 అన్నదాన కౌంటర్లు, 351 టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా రథసప్తమికి 3,500 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తారని ఈవో తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో చర్చించి సూక్ష్మ, స్థూల స్థాయిలలో సంబంధిత స్కిల్డ్, అన్ స్కిల్డ్ సిబ్బందిని నియమించకుని మరింత అప్రమత్తంగా అమలు చేసినప్పుడే ఎలాంటి కార్యక్రమాలు అయినా విజయవంతం అవుతాయన్నారు. గ్యాలరీలలో నియమితులైన అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా తాము అందిస్తున్న విధులు, బాధ్యతలను భక్తులకు తెలియజేస్తే ఎలాంటి సమస్యలు రావన్నారు. ఏదైనా సమస్యలు వస్తే తక్షణం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గత బ్రహ్మోత్సవాల్లో, వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందించిన స్ఫూర్తితోనే సేవలు అందించాలని కోరారు. రథసప్తమి సందర్భంగా వాహనానికి వాహనానికి మధ్య సమయంలో శానిటేషన్ కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

Share this post with your friends