తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాటిని వేలం వేస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ వస్తువులను వేలం వేయడం జరిగింది. ఇక ఇప్పుడు వాచీల వంతు వచ్చింది. శ్రీ మలయప్ప స్వామివారికి విరాళంగా అందించిన వాచీలను మే 1, 2వ తేదీలలో రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, సిటిజన్, సొనాట, రాగా, టైమ్స్, టైమెక్స్, ఇతర కంపెనీల స్మార్ట్ వాచీలున్నాయి.
కొత్తవి/ ఉపయోగించిన/ పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 62 లాట్లు ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెటింగ్ కార్యాలయం (వేలములు) 0877-2264429 నంబరులో సంప్రదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కార్యాలయం వేళల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.govt.in ను సంప్రదించాలని టీటీడీ సూచించింది.