భక్తులు తొందరపాటుకు గురి కాకుండా టోకెన్లు తీసుకోండి..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత బాధ్యతాయుతంగా మెరుగైన సేవలు అందించాలని టీటీడీ జేఈవో శ్రీమతి ఎం.గౌతమి సూచించారు. శ్వేతా భవనంలో డిప్యూటేషన్ పై రానున్న సిబ్బందికి జరిగిన శిక్షణలో టీటీడీ జేఈవో, తిరుపతి జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ క్యూలైన్లలోకి వచ్చిన భక్తులకు సంయమనం పాటించి టోకెన్లు జారీ చేయాలన్నారు. భక్తుల పట్ల క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. టోకెన్లు జారీకి కావాల్సిన మౌళిక సదుపాయాలైన కంప్యూటర్లు , ప్రింటర్లు, కెమెరాలు, ఆధార్ కార్డు గుర్తించేలా తదితర ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యం మేరకు క్యూలైన్లు, బారికేడ్లు, మంచినీరు, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేశామన్నారు.

అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడుతో కలిసి ఆమె తిరుపతిలోని టోకెన్లు జారీ కేంద్రాల్లోని కౌంటర్లను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ, తిరుపతి, తిరుమలలో ఉన్న సెంటర్లలోని కౌంటర్స్ లలో కావాల్సిన ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా సరైన పద్దతిలో హోల్డింగ్ పాయింట్స్, క్యూలైన్స్ లను టిటిడి ఏర్పాటు చేసిందన్నారు. భక్తులు తొందరపాటుకు గురికాకుండా క్యూలైన్లోకి వచ్చి టికెట్లు తీసుకొని చాలా సునాయాసంగా సురక్షితంగా వెళ్లాలని కోరారు. భద్రతా చర్యలో భాగంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోణ, ఇందిరా మైదానం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ తనిఖీల్లో టీటీడీకి చెందిన పలు శాఖల అధికారులు, తిరుపతి పోలీసు అధికారులు ఉన్నారు.

Share this post with your friends