వ్రతాలనేవి హిందూ సంప్రదాయంలో భాగం. ముఖ్యంగా శ్రావణ మసంలో ఎక్కువగా ఈ వ్రతాలు చేస్తుంటారు. ముఖ్యంగా సుమంగళిగా జీవించాలని కొందరు.. సంతానం కోసం కొందరు.. ఐశ్వర్యం కోసం కొందరు వ్రతాలు చేస్తూ ఉంటారు. సంతానం కోసం వ్రతం చేసే వ్రతమేంటి అంటారా? పుత్రగణపతి వ్రతం. ఈ వ్రతాన్ని ప్రాచీన కాలంలో ఋషులు మొదలుకొని రాజుల వరకూ ఎందరో ఆచరించి సంతాన భాగ్యాన్ని పొందారట. మరి ఈ వ్రతం ఎప్పుడు చేయాలి? దీని విశేషాలేంటి? తెలుసుకుందాం. సంతాన భాగ్యం కోసం ఎందరో దంపతులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారు పుత్ర గణపతి వ్రతం చేస్తే తప్పక సంతానం లభిస్తుందట.

సాధారణంగా సంతానం కోసం ఎంతగానో ఎదురు చూసేవారికి పుత్రుడు, పుత్రిక కావాలన్న నిబంధనేం లేదు. కేవలం సంతానం కలిగితే చాలని ఎదురు చూస్తుంటారు. అయితే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ‘పున్నామ నరకం’ నుంచి రక్షించేవాడే పుత్రుడని అంటూ ఉంటారు. అంటే హిందూ సమాజం విశ్వాసం ప్రకారం.. మరణానంతరం తల్లిదండ్రులకు ఉత్తరక్రియలు జరిపే అధికారం కుమారునికి మాత్రమే ఉంది. అంతేకాకుండా వంశాభివృద్ధి అనేది పుత్ర సంతానం వల్లనే కలుగుతుందని కూడా నమ్మకం. కాబట్టి పుత్ర సంతానం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలాంటి వారు ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరి్తారు. ముఖ్యంగా పితృ ఋణం తీర్చుకోవడానికి, వంశం నిలబెట్టుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
