ఇవాళ భోగి పండుగను దేశమంతా అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. భోగి పండుగ నాడు చిన్నారులకు భోగి పండ్లు పోస్తుంటారు. అసలు అలా పోయడం వెనుక మర్మమేంటో తెలుసుకుందాం. భోగి పండుగ ప్రధానంగా వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే రైతుల పండుగ. ప్రతి రైతు ఇంటికి పొలం నుంచి పంట చేరుతుంది. ప్రతి లోగిలి ధాన్యరాశులతో కళకళలాడుతూ దర్శనమిస్తుంది. ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కాబట్టి గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ ‘భోగి’తో భోగ భాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. గోదాదేవి రంగనాథుడిని చేపట్టిన రోజు కూడా ఇదే. భోగి నాడు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సంప్రదాయం ఉన్నది.
భోగి పండ్లు అంటే రేగు పండ్లలో పూలు కలిపి చిన్నారుల తల మీద పోస్తారు. దీనివల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. చిన్నారుల తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందట. భోగి పండ్లను తలపై పోయడం ద్వారా ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపితం చేస్తారు. తద్వారా పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం. రేగుపండ్లు, చెరకు ముక్కలు, పూల రెక్కలు, చిల్లర నాణేలను భోగి పండ్లుగా వాడతారు. రేగు పండ్లకు బదరీఫలాలని కూడా పేరు. దీనికి కూడా ఒక కథ ఉంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నర, నారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తుండగా, వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారట. దీనికి ప్రతీకగానే భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చింది. అలా ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగిపండ్లు పోస్తారు.