నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ కథేంటంటే.. శ్రీ ఆకాశ మహారాజు నారాయణవనమును కేంద్రంగా చేసుకుని పాలించు చుండెను. వారు సంతానార్థియై పుత్రకామేష్టి యాగము చేయ సంకల్పించి, యాగ స్థలమును స్వర్ణ హలముతో దున్నుతున్న తరుణమున ఒక మందసము నందు పద్మముపై పడుకొన్న చందమున ఒక ఆడ శిశువు లభించింది. ఆ శిశువు పద్మోద్భవిగా తలచి పద్మావతి అను నామ ధేయము చేసి రాజు గారు ఆమెకు విద్యాబుద్ధులు నేర్పి, దిన దిన ప్రవర్థమానురాలుగా చేయసాగెను. శ్రీ పద్మావతి దేవి యుక్త వయస్సు సమయములో ఒకనాడు తన చెలికత్తెలతో వన విహారము చేయు సందర్భమున వైకుంఠపతియైన శ్రీ శ్రీనివాసుడు వేట మార్గమున వచ్చుచుండగా ఆమెను చూచి, మోహించి, ఆమెని ఆకాశరాజు అనుమతితో సకల దేవతల సమక్షమున విళంబి నామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్లదశమి, శుక్రవారం వివాహం చేసుకొనెను.
వారి జ్ఞాపకార్థం శ్రీ ఆకాశ మహారాజు నారాయణవనమున ఆలయ నిర్మాణం గావించి, వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలు జరుపుటకు ఏర్పాటు చేసినారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు అర్చావతారియై, వృక్ష స్థలమున లక్ష్మీదేవి, దశావతార వడ్డ్యాణం, వేట ఖడ్గం, దక్షిణ హస్తమున కల్యాణ కంకణధారియై, నేత్ర దర్శనముతో వేంచేసి యున్నారు. ఈ ఆలయ ఆకాశరాజు పరిపాలన అనంతరం, కార్వేటినగరం సంస్థానాధీశుల ద్వారా నిర్వహించబడి, తదనంతరం 09-04-1967 సంవత్సరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి చేర్చబడి నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, సంవత్సరోత్సవాలతో విలసిల్లుతున్నది.