భారత్ – పాక్ సరిహద్దులో ఉద్రిక్తత నడుస్తోంది. అయితే సరిహద్దు ప్రాంతమైన రాజస్థాన్లోని జై సల్మేర్లో ఒక మిస్టరీ ఆలయం ఉంది. గతంలో అంటే 1965 , 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధాల సమయంలో ఈ ఆలయంపై కూడా బాంబుల వర్షం కురిసింది. అయినా సరే.. ఆలయం చెక్కు చెదరలేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు వేల బాంబులు వేసినా కూడా ఈ ఆలయంపై ఎలాంటి ప్రభావమూ చూపలేదు. వాటిలో 450 బాంబులైతే అసలు పేలనే లేదట. ఆ ఆలయం తనోట్ అమ్మవారి ఆలయం. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆ పేలని బాంబులు ఇప్పటికీ తనోట్ మాతా దేవాలంలోని మ్యూజియంలో ఉన్నాయట.
1965 భారత్-పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ మూడు వేర్వేరు ప్రదేశాల నుంచి ఆలయంపై దాడి చేసింది. ఆ సమయంలో అమ్మవారి ఆలయాన్ని రక్షించేందుకు భారత సైన్యం నడుం బిగించింది. ఈ క్రమంలోనే మేజర్ జై సింగ్ నేతృత్వంలోని ఒక బృందం, సరిహద్దు భద్రతా దళానికి చెందిన రెండు బృందాలు పాకిస్తాన్ మొత్తం బ్రిగేడ్ను ఎదుర్కొన్నాయి. ఈ సమయంలోనే పాక్ సైన్యం ఈ ఆలయంపై మూడు వేల బాంబులు వేసింది. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు శత విధాలుగా పాక్ సైన్యం యత్నించింది. అంతేకాకుండా ఆ తరువాత కూడా పాక్ సైన్యం ఈ ఆలయంపై ఫోకస్ పెట్టింది. దీంతో ఈ ఆలయాన్ని రక్షించే బాధ్యతను బీఎస్ఎఫ్ తీసుకుంది. నేటికీ ఆలయాన్ని శుభ్రం చేసి నిత్య పూజలను బీఎస్ఎఫ్ నిర్వహిస్తోంది.